Friday, July 30, 2010

రావిశాస్త్రి - కథల్లో కవిత్వమే రాస్త్రి





రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 జులై 22 న శ్రీకాకుళం లో పుట్టారు. కథా రచయితగా, నవల, నాటక రచయితగా పాఠక లోకంలో రావిశాస్త్రిగా  పాఠకలోకానికి సుపరిచితులు. ఈ రోజు రావిశాస్త్రి పుట్టిన రోజు.


ఇతివృత్త స్వీకరణలో, రచనా విధానంలో, శైలీ విన్యాసంలో రావిశాస్త్రి   ఎన్నో కొత్త పోకడలు ప్రదర్శించారు. అవి సమకాలిన రచయితలెందరికో మార్గదర్శకమయ్యాయి.  సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, వారి జీవన విధానాలు, సమాజంలో దిగజారిపోతున్నవిలువలు అందుకు అంతర్గతంగా సమాజంలోనే దాగిఉన్న కారణాలు వీటన్నిటినీ  అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు రావిశాస్త్రి.


కథలో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనే ప్రశ్నలకు రచయిత భావించే సమాధానమే కథాశిల్పంగా రూపొందుతుంది. దానిని బట్టే కథా వస్తువు క్రమంగా పాత్రచిత్రణ, సన్నివేశాలు, సంఘటనలు, నేపథ్యం వంటి ప్రధానాంగాలతో ఏర్పడి వికసిస్తుంది. అలాగే రచయిత భాషా ప్రయోగం కూడా అతను ఉద్దేశించే ప్రయోజనాన్ని బట్టి ప్రకటితమవుతుంది.


రావిశాస్త్రి రచనలు ప్రధానంగా వచన రచనలు. ఆధునిక సాహిత్య రూపాలయిన కథ, నవల, నాటకాలు, పొట్టికథలు వంటి అనేక ప్రక్రియలలో రావిశాస్త్రి రచనలు చేసారు. రావిశాస్త్రి రచనలలో అంతర్లీనంగానే అయినా అత్యంత రసభరితంగా వ్యక్తమయే కవితా ధోరణి రావిశాస్త్రి వచన రచనా శిల్పానికి ప్రత్యేకతను ఆపాదించింది.


"సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొక చోట ప్రవాహంలా పరవళ్ళు తొక్కుతుంది. ఇంకొక చోట జలపాతంలా ఊపిరి సలపకుండా వుక్కిరి బిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొక్కచోట అచ్చమైన కవిత్వంగా మారి కావ్య స్థాయికి తీసుకువెళ్తుంది "  అని గొప్ప కథా రచయిత శ్రీ మధురాంతకం రాజారాం రావిశాస్త్రి కవితామయమైన శైలిని ప్రశంసించారు. 


సరళమైన వ్యావహారిక భాషలో రచనలు చేసారు రావిశాస్త్రి. ఒకదానివెనుక ఒకటిగా ధారగా వ్యక్తమయ్యే భావాలకూర్పు, వాక్యాలలోని లయ, తేలికగా అర్థమవుతూ సాగే భాష  పఠిత మనసులో రచయిత ఊహిస్తున్న భావాన్ని రూపుకట్టిస్తాయి. వెనువెంటనే  పాఠకుల అనుభూతిలోకి వచ్చే పదచిత్రాలతో రావిశాస్త్రి వాక్యప్రవాహం అద్భుతమైన వచన కవితా ఖండికలా తోపింపచేస్తుంది. పాఠకుడిలో వివశత్వం కలిగించి రచయిత వెంట లాక్కుపోతుంది.


రావిశాస్త్రి రాసిన కథలలో  ప్రధానంగా పాత్ర చిత్రణలో, పాత్రల బహిరంతర పరిస్థితులమధ్య సంఘర్షణ వర్ణనలో ఆయన కవితావేశం కనిపిస్తుంది.


రావిశాస్త్రి కవితాశైలి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్పవలసిన కథ వెన్నెల.


ఆద్యంతం కవితాత్మకంగా సాగుతూ ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్యమయిన ఘట్టాలను వర్ణిస్తూ ప్రకృతిలోని వెన్నెల వెలుగులోనే అవి జరిగినట్టుగా చెప్తారు. తల్లి కడుపున అతను పుట్టినప్పుడు, రోగంతో అతని తల్లి మరణించినప్పుడు, మరొక మూడేళ్ళకి తండ్రి కళ్ళుమూసినప్పుడు  పైన ఆకాశంలో  పండు వెన్నెల కురుస్తోంది.వరకట్న సమస్యతో అక్క చనిపోయినప్పడు, తనకి పెళ్ళి జరిగినపుడు,  అనారోగ్యంతో  భార్య చనిపోయినప్పుడు కూడా వెన్నెల కురుస్తూనే ఉంది. కానీ అతని కొడుకుకి మాత్రం వెన్నెలలో సౌందర్యంకానీ, హాయి కానీ కనిపించలేదు. వెన్నెలలోని చల్లదనాన్ని కాక కార్చిచ్చులనే చూసాడు అతను. కథకుని కొడుకులో  మానవ ప్రకృతి సహజంగా వెన్నెలలోని సౌందర్యాన్ని చూసి తన్మయత్వం పొంగకుండా అందులో కార్చిచ్చునే చూడడాన్ని అవ్యక్తంగా సూచిస్తూ,   కథకుడి పాత్ర ద్వారా  రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.


అంతటా వెన్నెలే, కాని ఎచటా చిచ్చులే.
వెన్నెలా వెన్నెలా నువు చూపే దృశ్యాలకి మనసు చెదురుతుంది వెన్నెలా
నువ్వు చూపే చిత్రాలకి గుండె కరుగుతుందో వెన్నెలా
అది సహజమే వెన్నెలా
కాని ఆయా దృశ్యాలకి, చిత్రాలకి, నీ తడితో పడుచు రక్తం ఉండుకుతుందే వెన్నెలా
అది కూడా అతి సహజం కాదటమ్మా వెన్నెలా


అవును -
యువరక్తం ఉడుకుతుందది వెన్నెలా
సుళ్ళుగా పరవళ్ళు తొక్కుతుందది వెన్నెలా...
అన్యాయాన్ని ప్రశ్నిస్తూ  వెన్నెల వెలుగులోని హాయి, ఆహ్లాదం  సామాన్యులకి కూడా అందాలని ఆశించి అందుకు  ప్రయత్నించిన కొడుకు   సమ్మెకట్టి కార్మకుడై వెన్నెల వెలుగులోనే పోలీసుల మరతుపాకులకు బలి అయ్యాడు. వెన్నెల వెలుగులోనే కథకుడి జీవన దీపం ఆరిపోయింది.
ఆకాశం నిండా ఏటి చల్లని వెన్నెల పరచుకొని ఉన్నా, వీధినిండా వెండి తెల్లని వెన్నెలే వెన్నెలే  నిండి ఉన్నా అధర్మానికి బలి అయిన వారి ఎర్రని రక్తం కలిసి తడి తడిగా ఎర్రనెర్రని వెన్నెల ప్రవహించింది.
కన్న తల్లీ వెన్నెలా
లోకమంతా వెన్నెలే నీ పాలు పొంగిన వెన్నెలే
కాని
మాకు మాత్రం దానినిండా జీరలే.
పేద నెత్తుటి వేడి నెత్తుటి జీరలే
దానికింద మాకు మాత్రం విషపు నల్లని చీకటే కారు చీకటే
వెన్నెలా ఓ వెన్నెలా
ఓహో మా వెన్నెలా
అయ్యయ్యో  ఓ వెన్నెలా....


వెన్నెల కథలో రావిశాస్త్రి కథనంలో వాడిన పదచిత్రాలు, వాక్యాల కూర్పుతోనే కథలోని వస్తువును ధ్వనిస్తూ పాత్రలను, సంభాషణలు, సంఘటనలను పరోక్షంగానే పఠితకు రూపుకట్టిస్తారు. భాషమీద, కథన ప్రక్రియ పైన పట్టు ఉన్న గొప్ప రచయితలు మాత్రమే చేయగల ప్రయోగం ఇది.


 మెరుపు మెరిసింది కథ లో నేపథ్యం వర్షం. పెళ్ళికాని యువతి  నీరజ నిరాశామయమయిన జీవితానికి ప్రతీక వర్షం. వర్షంలో మెరిసే మెరుపులు ఆమె ఆశలు. ఆమె పొందాలనుకున్న జీవితానందానికి ప్రతీకలు. చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి వీల్లేకుండా  వర్షం ఆటంకం కలిగిస్తే ఒక యువకుడు ఆమెని తన కారులో గమ్యానికి చేరుస్తాడు. అప్పుడు ఆమెలో చెలరేగిన ఆశలని రచయిత ఇలా వర్ణిస్తారు.


మబ్బుల్లోంచి
వర్షంలోంచి
తలుపుల్లేని కిటికీలోంచి
చీకట్ని తోసేస్తూ
మెరుపులు
ఒకమెరుపు, ఒకటి మరొక మెరుపు రెండు మరో మెరుపు మూడు
ఒకటీ రెండూ మూడు.
మరునాడు కూడా అదే యువకుడు తనను మళ్ళీ కారు ఎక్కించుకుంటాడని ఆశపడిన నీరజకి నిరాశ ఎదురయింది.


అదో మెరుపు ఇదో మెరుపు మరో మెరుపు
ఒకటీ రెండూ మూడూ
హాస్యాస్పదం నవ్విపోతారు
అదిగో మెరుపు
ఇదే మాయమయింది.
మళ్ళీ మెరిసింది మాయమయింది
ఇంతే ఇది
ఆఖరికిదే నిజం.
ఈ చీకటే ఇదే ఈ చీకటే నిజం.


ఆశనిరాశలకి ప్రతీకాత్మకంగా, మెరుపులు, చీకటి  మొదలయిన పదబంధాలతో సూచిస్తూ నీరజ పాత్రని కవితాత్మకంగా ఆవిష్కరించారు రావిశాస్త్రి.


జరీ అంచు తెల్లచీర కథలో జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను, ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.


ఇది మెరుపు లేని మబ్బు
ఇది తెరిపి లేను ముసురు
ఇది ఎంతకీ తగ్గని ఎండ
ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి
ఇది గ్రీష్మం
ఇది శిశిరం
ఇది దగ్ధం చేసే దావానలం
ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం
ఒక్కటి ఒక్కటే సుమండీ ఒక్క
జ రీ అం చు తె ల్ల చీ ర


విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ, పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి.


న్యాయ వ్యవస్థలో వృత్తికి, ప్రవృత్తికీ సంఘర్షణ ఏర్పడి ఏది న్యాయమో తేల్చుకోలేక చిత్తచాంచల్యం పొందిన మెజిస్ట్రేటు పాత్రని చిత్రించారు మోక్షం కథలో. కథా ప్రారంభంలో కోర్టును వర్ణిస్తూ -


పైన భగ్గున మండే సూర్యుడు
బైట ఫెళ్ళున కాసే ఎండ
ఎండ ఎలా ఉంది
పులికోరలా పాము పడగలా
నరకం ఎలా ఉంటుంది
పులితో పాముతో చీకటిగా.


కోర్టులో ఆవరించి ఉన్న చీకటి మెజిస్ట్రేటుగారి మనసునిండా అలముకుంది. న్యాయం పేరుతో కోర్టులో  జరుగుతున్న దురన్యాయాన్ని గురించి మథన పడతారు.


ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి
పోలీసువారి ఎర్ర టోపీల నిండా
చారలు చారలుగా చీకటి
చుట్టూ పడున్న ఖాళీ సారా
కుండలనిండా చల్లారని చీకటి
ముద్దాయిల కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి


కోర్టులో  చట్టాన్ని కాపాడే పేరుతో  ప్లీడర్లు, పోలీసులు  చేస్తున్న అన్యాయాలకు ప్రతీక ఇక్కడి చీకటి పదం.పదే పదే చీకటి  అనే పదం ఒక్కొక్క అర్థంలో ప్రయోగించబడింది. చివరకు నిరపరాధులైనా సాక్ష్యాలు బలంగా ఉండడంతో, కోర్టులోని న్యాయసూత్రాలు తెలియక నిరక్ష్యరాస్యులుగా ఉన్న అమాయకపు ముద్దాయిలను శిక్షించవలసి రావడం మెజిస్ట్రేటుగారిని భయపెడుతుంది.


నామీద కొన్ని వేల పగలు
లోకంలో కోటానుకోట్ల పగలు
అనుకుంటాడు. పగ అనగానే సంప్రదాయపు విశ్వాసం పాములు పగపడతాయని గుర్తువచ్చి చుట్టూ ఉన్న సారా ట్యూబులు పాముల్లా కనిపించాయి.


పాముల్లా వాటి పడగల్లా
ఏమిటి ఏమిటవి
రోజూ ఇలాగే పాముల్లా సారూ ట్యూబులు
మోటర్లవి, సైకిళ్ళవి, ఎర్రవి, నల్లవి
అన్నిట్లోనూ సారా
కోర్టుకొస్తే సారా
కోర్టులో ఉన్నంతసేపూ సారా
రోజూ దాదాపు ప్రతి కేసూ సారా.....
ఇలా సారా కేసులు తీర్పుల మధ్య నలిగిన మెజిస్ట్రేటుగారికి నిరపరాధులకి జైలు  శిక్ష వేసి పాపం మూటకట్టుకుంటున్నాననే అపరాథ భావం కలిగింది.


రావుగారి మెదడంతా
చీకటి గదిలా ఉంది
చీకటి గదిలో చీమల ఏడుపు
వాటి గురించి తేళ్ళు, జెర్రులు
నరకం ఎలా ఉంటుంది
తేళ్ళతో, జెర్రులతో అతి చీకటిగా
అక్కడ ఏముంటాయి
పగపట్టిన చలిచీమలు
....
రావుగారి మానసిక సంఘర్షణను ప్రతీకాత్మకంగా సూచించిన పదచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. చీకటిగది జైలుని,
చీమల ఏడుపు అనే పదబంధం జైల్లోని ఖైదీల బాధని, తేళ్ళు, జెర్రులు పోలీసులు వార్డర్లని సూచిస్తాయి. చలిచీమల చేత చిక్కి పద్యం గుర్తు రావడంలో ఆ నిరపరాధులంతా కలిసి తనను చంపుతారేమోని రావుగారికి  భయం వేసింది.


నా చేతులు నల్లని తాచులు
నా చేతుల మూతుల్లో ఐదేసి నాలుకలు
అన్నేసి కోరలు
ఈ సిరాలో విషం నా కలంలో కాటు


మెజిస్ట్రేటు పాత్రలో క్రమక్రమంగా కలిగే సంఘర్షణను కవితాత్మకమైన, ప్రతీకాత్మకమైన పదచిత్రాలతో వర్ణించారు రావిశాస్త్రి.


అధికారి కథలో  ఆశలన్నీ నిరాశలుకాగా కుప్పకూలిన నూకరాజు మానసిక స్థితిని వర్ణిస్తూ -


అతను వెలిగించుకున్న జ్యోతులన్నీ అకస్మాత్తుగా
అతని కట్టెదుటే ఏట్లోకి దిగిపోయి ఆరిపోయాయి
అతను వేసుకున్న రంగుల డేరా
అతని కళ్ళెదుటే మాడి మసైపోయి మాయమయిపోయింది
అతను వేసుకున్న పూలతోట
అరక్షణంలో పాముల పుట్టగా మారిపోయింది.
అతనికి తూర్పుదిక్కు ఎటో వెళ్ళిపోయి
పడమటి దిక్కు ఎదురొచ్చింది.


అంటూ ఆ పాత్ర మనసులో చెలరేగిన తుఫానులాంటి స్థితిని  పదచిత్రాలతో చూపుతారు రావిశాస్త్రి.


పువ్వులు కథలో  బంతినారునుంచి మొక్కలు విడదీసి పాతిన కమల అవి తలలు వేల్లాడదీయగానే  దిగులు పడుతుంది. కానీ రాత్రి పడిన వర్షంతో  తలలు పైకెత్తి జీవంతో కలకలలాడుతున్న మొక్కలు చూసి సంతోష పడుతుంది. ఆ అమ్మాయి  సంతోషాన్ని  ఇలా వర్ణిస్తారు రావిశాస్త్రి-


ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల
అటు ఆ మొక్క దగ్గరకి పరిగెట్టింది కమల
ఇదే కమల ఈ మొక్కా అయింది
ఇదే కమల ఆ మొక్కా అయింది
నిన్న రాత్రి నీటిమబ్బూ ఈ కమలే
నిన్న రాత్రి వానజల్లూ ఈ కమలే
ఆ కమలే ఈ ఉదయం సూర్య రశ్మిగా మెరుస్తోంది
అదే కమల ఈ ఉదయం చల్లగాలిలా వీస్తోంది.


ప్రాణాన్ని పెంచి పోషించే వారికి మాత్రమే ఈ ఆనందం తెలుస్తుందంటూ రావిశాస్త్రి చేసిన ఈ వర్ణనలో ప్రకృతికీ, మనిషికీ గల అనుబంధం, ప్రకృతిలోని సౌందర్యంతో మనిషి పొందే తాదాత్మ్యం రూపుకట్టిస్తారు.  


కిటీకీ కథలో వర్ణింపబడే దృశ్యాలు కవితాత్మకంగా సాగుతాయి. బిచ్చగాడి మనసులో అతను పొందలేని సౌఖ్యానికి  ప్రతీకగా తాను రోజూ చీకటిలో చూసే కిటికీని స్వర్గంగా భావిస్తూ ఉంటాడు.

నిజానికి బిచ్చగాడి పాత్రకి తన మనసులో ఊహిస్తున్న దృశ్యాలను వర్ణించే శక్తి, భాష లేవు. రచయిత రావిశాస్త్రి రమ్యమయిన పదచిత్రాలతో అతను చూసే దృశ్యాన్ని  వర్ణిస్తారు. కిటికీ లోంచి  కనబడే స్త్రీ పురుషులను దేవతలుగా భావింపచేస్తూ సమతౌల్యం కలిగిన వాక్య నిర్మాణంతో సాగే ఈ వర్ణన ద్వారా సాధారణమైన దృశ్యాన్ని కూడా అద్భుతంగా భావించడానికి కారణమైన బిచ్చగాడి దైన్య స్థితి పాఠకులకు అవగతమౌతుంది.


పంచరంగుల పువ్వుల తోటల్లోకి
తెల్ల పావురాల మెడ వంపుల మెరపుల్లోకి
కొండ నీడల కులికే చల్లని తోటల నీడల్లోకి
తెలిమబ్బుల తేలిపోయే గాలి మేడల్లోకి
చుక్కల బాటల్లోంచి
ముత్యాల ముగ్గుల్లోంచి
స్వప్నాల స్వర్గాల్లోకి
స్వర్గాల స్వప్నాల్లోకి
అదీ -
ఆ కిటికీ.


తెరిచిన కిటికీలోని దృశ్యాన్ని చూస్తూ తన జీవితంలో అనుభవించలేకపోయిన తనకు దూరమైన జీవితానందాన్ని పొందుతూ ఉన్న ముసలితాత, జల్లుకొడుతోందని అక్కడ కిటికీ మూయబడడంతో తాను కూడా కళ్ళు మూస్తాడు.


చీకటివరదలో
మధుర స్వప్నాలు ములిగిపోయాయి
ఆవరించుకున్న మేఘాల పొగల్లో మాయమయేయి
నిత్యంగా ఉండాల్సిన వసంతం
ఏదీ ఎక్కడికి పోయింది
కదలాడిన ముత్యాలు స్వప్నాలు స్వర్గాలు


అన్నీ కూడా ఏమయిపోయాయి అంటూ ముష్టి ముసలితాత జీవన వైఫల్యానికి కారణాలను వ్యవస్థలో వెతుకుతూ పఠితను ఆలోచింపజేస్తారు.   అతని మరణానికి సూచనగా  స్వర్గం కరిగిపోవడంగా సూచించారు రావిశాస్త్రి.


రావిశాస్త్రి కి సైగల్ పాటలంటే ప్రాణం. సైగల్ పాట వినడంలో రావిశాస్త్రి పొందే అనుభూతి ప్రత్యేకమైనది. సైగల్ పాటకి పాపాలను కడిగేసే శక్తి ఉందని, ఆ  పాట అతి పవిత్రమైనది అని  నమ్మారు .


సైగల్  కథలో రామారావు పాత్ర క్రూరమైన మనస్తత్వం కలిగినదే అయినా  పార్క్ లో సైగల్ పాట విని అతని మనస్తత్వంలోనే గొప్ప మార్పు కలగడం మంచికి మారడం పాఠకులు నమ్మలేనిదే అయినా రావిశాస్త్రి వర్ణనలో, రూపుకట్టించిన పద చిత్రాలలో, వాక్యాల కూర్పులో, వాడిన అలంకార ప్రయోగంలో రచయిత తో పాటుగా పాఠకుడిలో కూడా సైగల్ గొప్పదనాన్ని విశ్వసించే విధంగా చూపబడింది.


ఈ పాటలో
వెన్నెల వెలుగులున్నాయా
చుక్కల తళుకులున్నాయా
చిక్కని చీకట్ల నునుపులున్నాయా
ఇంద్ర ధనుస్సుల రంగులున్నాయా
వేడికొండల నిట్టూర్పులున్నాయా
ఈ పాటలో
ప్రియురాలి విరహముందా
పడుచు రక్తపు ప్రవాహముందా
స్మృతులే మిగిలిన ముసలివాని బోసి నవ్వుందా
పసిపాపల హాసముందా
సీతాదేవి శోకముందా
రాథేయుని హృదయముందా
ఈ పాటలో
ఏవేవో ఉన్నాయి
ఎన్నెన్నో ఉన్నాయి
కానీ
ఈ పాటలో పాపాల్లేవు
ఈ పాట పాపాన్నెరుగదు....


అలాగే కలకంఠి కథలో మానవ జీవితాలలోని అనంతమైన వైవిధ్యాన్ని వర్ణించడానికి మానవ కంఠాలకు ఆ వైవిధ్యాన్ని ఆపాదిస్తూ కవితాత్మకంగా వాక్యాలు పేర్చారు.


అసహాయంగా జాలిగా కుంగిపోతాయి
అదృష్టం బావుండక పోతే ఉత్తరించుకుపోతాయి
ఇంపుగా పలుకుతాయి
శ్రావ్యంగా పాడతాయి
సొంపుగా కలకల్లాడతాయి
పూలమాలల్తో కావలించుకుపోతాయి
ముత్యాల హారాల్తో ముడివేసుకుపోతాయి
పచ్చటి పుస్తేల తాళ్ళతో బంధించుకు పోతాయి
చిత్రమయిన పనులు చాలా చేస్తాయి మానవ కంఠాలు.


నిజానికి పై ఉదాహరణలలో  పేర్కొన్న వాక్యాలన్నీ వచనంగా వరుసగా రాయబడినవే. కానీ పాదాలుగా విభజించే వీలుండే సౌలభ్యం వలన కవితా ఖండికలుగా చూపించడం కోసం  ఇలా రాసి చూపడం జరిగింది.
రావిశాస్త్రి వచనంలోన  వాక్య నిర్మాణంలోని తూగు, లయ కలిగిన కవితాత్మకత అనే లక్షణం వలన వీటిని కవితా ఖండికల గా చూడగలం. శ్రీశ్రీ తనను ఉర్రూతలూగించాడని, శ్రీశ్రీ గేయాలు రాసే భాషలో కథలు రాయాలని ఉండేది అన్నారు ఒకచోట రావిశాస్త్రి. జీవిత వాస్తవాన్ని చూసే కళ్ళుంటే,  కాదేదీ కవితకనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పిన వస్తువులను కథలుగా మలచడంతోపాటు ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ రసనిర్దేశం అని శ్రీశ్రీ అన్నట్టుగానే తన కథలలో కవితావేశం ప్రదర్శించి పాఠకులలో రసనిర్దేశం చేసారు రావిశాస్త్రి.


చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కవితా ఖండికలు దొరుకుతాయి రావిశాస్త్రి వచనంలో.

"వచనం రాసే వారిలో నికరమైన కవి......
రావిశాస్త్రి వచనంలో అలా అలా అంతర్లీనంగా ఆయనదే ఐన ఒకానొక అద్భుత కవిత్వం ఒదిగి పోయింది. ....అవకాశం దొరికిన ప్రతిచోటా ఉత్తమ శ్రేణి కవిత్వం స్వాభావికంగా వచ్చి చేరిపోయింది "-
అన్న విమర్శకుల ప్రశంస అక్షర సత్యంగా కనిపిస్తుంది. 




రాచకొండ విశ్వనాథ శాస్త్రి
కథలలో కవిత్వమే రాస్త్రి !!

Wednesday, January 7, 2009

కథలు -ఏపేరుతో, ఎక్కడ

రావిశాస్త్రి 1950నుంచి 1990 మధ్య రాసి ప్రచురించిన కథలు వేరువేరు పేర్లతో ప్రచురించబడ్డాయి.చాలా మందికి ఈ విషయం తెలుసు.
రావిశాస్త్రి మారుపేరుతో రాసిన కథలు ఏవి,అసలు పేరుతో వ్రాసిన కథలు ఏవి అని తెలుసుకోగోరే పాఠకులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది.
శంకరగిరి గిరిజా శంకరం
అన్ జానా,
జాస్మిన్,
గోల్కొండ రాం ప్రసాద్
ఇవి రావిశాస్త్రి మారుపేర్లు.
శంకర గిరి గిరజా శంకరం పేరుతో 25-10-1968 న ఆంధ్రజ్యోతి వార పత్రికలో జాతక కథ రాశారు.
అన్ జానా పేరుతో 17-4-1970 న ఆంధ్రజ్యోతి వార పత్రికలో ద్వైతాద్వైతం రాశారు.
29-5-1970 న ఆంధ్రజ్యోతి వార పత్రిక లో రవ్వ రాశారు.
మెరుపు మెరిసింది కథ జాస్మిన్ పేరుతో రాశారు.
గోల్కొండ రాం ప్రసాద్ పేరుతో మే,1964 లో యువ మాస పత్రిక లో ఓ మంచివాడి కథ రాశారు.
(ఈ వివరాలకు ఆధారం రచన మాసపత్రిక (ఆగస్టు,2007) ).

రావిశాస్త్రిరచనలు- ప్రచురణలు

రాచకొండ విశ్వనాథశాస్త్రి 1938 లో రచనలు ప్రారంభించి 1993 వరకు చేసిన రచనలు వివిధ దిన,వార,మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. కొన్ని కథాసంపుటులుగా వెలువడ్డాయి. కానీ చాలా సంపుటాలు పునఃప్రచురణ లేకపోవడం వలన తెలుగు పాఠకులకు అందుబాటులోలేవు. రావిశాస్త్రి గారి స్నేహితులు,అభిమానులు రావిశాస్త్రిగారి రచనలను ఒకచోట సేకరించి ప్రచురించే ప్రయత్నం చేసారు. 1994లో రావిశాస్త్రిగారి సోదరుడు రాచకొండ నరసింహశర్మగారు ఆర్థిక సహకారం అందించగా రావిశాస్త్రిగారి కుమారులు లక్ష్మీనారాయణ ప్రసాద్, ఉమా కుమార శాస్త్రి రాచకొండ ప్రచురణలు పేరున రావిశాస్త్రిగారి రచనలను ప్రచురించారు. ఇవి తొమ్మిది సంపుటాలలో ఉన్నాయి.


సంపుటి 1.
రాజు-మహిషి
( అసంపూర్తి నవల)
సంపుటి 2.
నాటకాలు-నాటికలు
నిజం, తిరస్కృతి , విషాదం
సంపుటి 3.
నాలుగార్లు
1. ఆరు సారాకథలు
2.ఆరు సారో కథలు
3.ఆరు చిత్రాలు
4.మరో ఆరు చిత్రాలు
సంపుటి 4.
ఋక్కులు
సంపుటి 5
బాకీ కథలు
సంపుటి 6
రావిశాస్త్రీయం
రావిశాస్త్రి వ్యాసాలు,డైరీలు,ఇతర రచనలు
సంపుటి 7
అల్పజీవి నవల
సంపుటి 8
మూడు నవలలు
మూడు కథల బంగారం
సొమ్మలు పోనాయండి
ఇల్లు
సంపుటి 9
రత్తాలు-రాంబాబు నవల
(అసంపూర్తి రచన -నాలుగు భాగాలు కలిపి)




1994 లో ప్రారంభించి 2004 డిసెంబరు వరకు కొంత కాల విరామంతో ప్రచురించబడిన ఈ రచనలు ప్రస్తుతం ఎన్ని తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్నాయో అనుమానమే.
ఆ మధ్య రాచకొండ విశ్వనాథశాస్త్రి సాహిత్యాభిమానులు ఆయన రచనలన్నీ రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనా సాగరం
అనే పేరుతో( మనసు ఫౌండేషన్ ) ఒకే సంపుటిగా వెలువరించారు, జులై 30,రావిశాస్త్రిగారి జన్మదినం సందర్భంగా.
సుమారు 1300నుంచి 1400 పేజీలతో డెమ్మీ సైజు లో ప్రచురించబడిన ఈ పుస్తకం కోసం ప్రయత్నం చేసినా దొరకలేదు.
అదృష్టవంతులెవరికైనా అవకాశం ఉంటే దీనిని స్వంతం చేసుకొని మళ్ళీ మళ్ళీ కావలసినన్ని సార్లు , నచ్చిన రచనలన్నీ చదువుకోవచ్చు-ఎంచక్కా.

Saturday, July 19, 2008

రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా ప్రస్థానం

రాచకొండ విశ్వనాథ శాస్త్రిని రావిశాస్త్రి అని పిలుస్తారని తెలుగు సాహితీ లోకంలో అందరికీ తెలుసు.


ఆయన వృత్తిరీత్యా న్యాయవాది.ప్రవృత్తిరీత్యా కూడా న్యాయం పక్షాన నిలబడి తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించారు..డబ్బుపలుకుబడి,అధికారమదంతో కొందరు ఇంకొందరికి చేసే దురన్యాయాలను ఎండకడ్తూ ఎన్నో కధలు,నవలలు, కొన్ని నాటకాలు వ్రాశారు.

జులై 30 రావిశాస్త్రి గారు పుట్టిన రోజు.శ్రీకాకుళం లో 1922 లోనారాయణమూర్తి,సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించారు.రావిశాస్త్రి గారికి మహ దేవశాస్త్రి అనే అన్నగారు, నరసింహ శాస్త్రి, సుబ్బారావు అనే తమ్ముళ్ళు,నిర్మల అనే చెల్లెలు ఉన్నారు. తండ్రిగారు కొంతకాలం ప్లీడరుగా పనిచేసి వ్యవసాయం లోకి దిగారు. శాస్త్రి గారి చదువు విశాఖపట్టణం లో సాగింది.
రావిశాస్త్రి గారి తల్లికి సంగీతసాహిత్యాలలో గల పరిచయం పిల్లలపై ముఖ్యంగా శాస్త్రిగారిపై చాలా ప్రభావం చూపింది.సమకాలికమైన పత్రికలు పుస్తకాలు చదవడం వలన రాజకీయ,సాహిత్యవిషయాలతో పరిచయం ఏర్పడింది.సాహిత్యమే కాక సంగీతంలో కూడా రావిశాస్త్రిగారికి మంచి అభిరుచి ఉండేది.

రావిశాస్త్రి గారిని విశ్వంగా ఇంట్లోను, ఆర్వీయస్ గా కోర్టులోను,చాత్రిబాబుగా క్లయింట్లతోను, రావిశాస్త్రిగా పాఠక లోకంలోను పిలవడం చాలా మందికి తెలుసు. కానీ రాచకొండ విశ్వనాథ శాస్త్రిగా .అల్పజీవి నవలారచయితగా తెలియక ముందు, శాస్త్రిగారు తన పదమూడవ ఏటనే రచనలు చేశారని, చాలా కథలు అప్పటి ప్రముఖ పత్రికలలో అచ్చుపడ్డాయని కొందరికే తెలుసు. 


నిజజీవితంలోనే కాక రచయిత గా కూడా రావిశాస్త్రిగారికి బోలెడు మారుపేర్లు.కాంతాకాంత,జాస్మిన్,గోల్కొండ రాం ప్రసాద్, శంకర గిరి గిరిజా శంకరం, అన్ జానా ఇలాంటి పేర్లతో ఎన్నో కధలు వ్రాశారు రావిశాస్త్రి.
రచయితగా తన రచనల తొలిదశ గురించి చెప్తూ రావిశాస్త్రి తన తొమ్మిదవ యేటనే ఒక డిటెక్టివ్ కథను, రసపుత్ర వీరులగురించి ఒక అసంపూర్తి నవలను వ్రాశానని, కొనసాగింపు తెలియక ఆపేశానని చెప్పారు. ఆయన పదహారవ ఏట 1938 లో దేవుడే చేసాడు అన్న పేరుతో వినోదిని పత్రికలో అచ్చయిన కథ ఆయన తొలి రచన. ప్రేమ ఫలితం, ఉద్యోగం దొరక్కపోతే, మీరే ఆలోచించండి కథలు విద్యార్థి దశలో ప్రచురించబడిన కథలు.
పంజరంలో చిలక, రైలుప్రయాణం పోరుపడలేక, స్వప్నమా సత్యమా మొదలైన కథలు వ్రాసిన రావిశాస్త్రి క్రమంగా రచనా వ్యాసంగం మానుకున్నారు. మంచి కథలు రాయలేకపోతున్నానన్న నిరుత్సాహమే దీనికి కారణం అన్నారు రావిశాస్త్రి. వివాహానంతరం భార్య సోమిదేవమ్మ గారు తన భర్త రచయిత కూడానని తెలిసి ఆశ్చర్యపోతే, ఆవిడని పదే పదే ఆశ్చర్యపరచడం కోసమే కథలు వ్రాసేనన్నారు. అలా దయ్యాలకు ద్వేషాల్లేవు పేరుతో ప్రారంభించిన కథా ప్రస్థానం ఆయన చివరి నవల 'ఇల్లు' వరకు కొనసాగింది.
రావిశాస్త్రి గారి కథలను వస్తురీత్యా గమనించినప్పుడు 1950 తరువాత వ్రాసిన కథలకు, 1970 తరువాత వ్రాసిన కథలకు గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కథనం, శిల్పంలో చమత్కారాలు, వర్ణనల విషయం పక్కన పెడితే వస్తువరణలో ఈ తేడా కనిపిస్తుంది.
రకరకాల మారుపేర్లతో కథలను వ్రాస్తూ వచ్చిన రావిశాస్త్రి 'అయ్యారే బాబారే ' పేరుతో వ్రాసిన నవలను భారతి పత్రిక
అల్ప జీవి గా పేరు మార్చి నాలుగు నెలల పాటు ధారావాహికంగా ప్రచురించింది. రాచకొండ విశ్వనాథశాస్త్రి పేరు శ్రీశ్రీ, పురిపండా లాంటి సాహితీ దిగ్గజాలను ఆకర్షించింది. రచయిత విశాఖ వాస్తవ్యుడని తెలిసి విశాఖ రచయితల సంఘం ఆహ్వానించింది.


విశాఖ రచయితల సంఘంలో బలివాడ కాంతారావు, కాళీపట్నం రామారావు, అంగర సూర్యారావు వంటి వారి పరిచయం రావిశాస్త్రిలోని రచయితకి కొత్తచూపునిచ్చింది. కేవలం తను రచయితగా గుర్తించబడాలన్న కోరిక మాత్రమే నేపధ్యంగా ఉన్న కధారచనకి ఒక ప్రయోజనం,నిబద్ధత ఉండాలనుకోవడంతో పరిణామం చెందింది. తనదైన ఒక దృక్పథాన్ని నిర్దేశించుకోవడానికి బీజం వేసింది విశాఖ రచయితల సంఘం.
విశాఖ నాటక కళా మండలి, సహవిద్యార్థి అబ్బూరి వరదరాజేశ్వరావు స్ధాపించిన నటాలి సంస్థ నటుడిగానే కాక నాటక ప్రయోక్తగా కూడా రావిశాస్త్రిని మలిచాయి. గురజాడ కళాకేంద్రం స్ధాపించి వచ్చేకాలం, నిజం నాటకాలను రచించి ప్రదర్శించారు .
1950 - 1960 మధ్య వ్రాసిన ఎన్నోకథలలో మధ్యతరగతి,దిగువ మధ్యతరగతి జీవన చిత్రణే కథావస్తువు. ఈవర్గానికి చెందిన వారి జీవితాలలోని సమస్యలు వాటికి కారణాలను వెతుకుతూ అందులోని జీవనవైఫల్యం, అంతర్లీనంగా ఉన్న విషాదం, మానవ సంబంధాలను ఆర్థిక కారణాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తూ సాగిన ఈ కథల పై రావిశాస్త్రి అభిప్రాయం అయ్యో అయ్యో కథలు మాత్రమే.
1960 ప్రాంతాలలో మద్రాసు ప్రొహిబిషన్ ఆక్టు ప్రకారం ఆంధ్ర దేశంలో మద్యపాన నిషేధ చట్టం అమలు లోకి వచ్చింది. ప్రభుత్వపరంగా నిషేధించబడిన సారా దొంగసారా రూపంలో విచ్చలవిడిగా స్వైరవిహారం చేసింది. మోటారు సైకిల్,రిక్షాచక్రాల ట్యూబులదగ్గరనుంచి ఆడవారి చీరల మాటున సారా ఏరులా ప్రవహించింది. ఈ దొంగసారా రవాణాకి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పడింది. ఆడ,మగ,పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా సారా రవాణాలో ఎందరో సహకరించారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం లోని అవినీతి మద్యపాన నిషేధ చట్టం విఫలం కావడానికి ప్రధాన కారణం అయింది.


అప్పుడప్పుడే స్వతంత్రంగా ప్రాక్టీసు ప్రారంభించి న్యాయవాదిగా జీవితం ప్రారంభించిన రావిశాస్త్రి జీవితంలోని మరో పార్శ్వాన్ని కొత్త కోణంలో చూడడానికి అవకాశం కలిగింది. సారా రవాణా కోసం ఏర్పడిన కొత్త వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందిన పేదలు అతి ముఖ్యమైన పాత్ర వహించారు. పోలీసుల ఆచూకిని పసిగట్టి హెచ్చరించగలిగే ఇన్ ఫార్మర్లుగా, పట్టుబడితే యజమానికి బదులుగా శిక్ష అనుభవించడానికి సిద్ధపడే వారిగా ఉంటూ వ్యాపారానికి సహకరించారు. పట్టుబడితే జరిమానా తాము కడతామని చెప్పి ఆ తర్వాత మోసం చేసిన కాంట్రాక్టర్ల వల్ల జరిమానా కట్టలేక శిక్షలు పడిన వారు, పోలీసులకు మామూళ్ళు ఇవ్వక పోవడం వల్ల అక్రమంగా కేసులు బనాయించబడిన వాళ్ళు -ఇలా ఎందరో పేద క్లయింట్లు రావిశాస్త్రిగారి సహాయం కోసం వచ్చేవాళ్లు.


రచయితగా తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుంటున్న రావిశాస్త్రికి తానెవరివైపు నిలబడాలో, తన రచనల వలన ఆశించే ప్రయోజనం ఏమిటో తేల్చుకోవలసిన అవసరం వచ్చింది. సంఘంలో జరుగుతున్న అన్యాయాలకు బలవుతున్నది అలగా జనమేనని, డబ్బు పదవి, పలుకుబడి ఉన్నవారు నిజంగా తప్పు చేసినా తప్పించు కోగలుగుతున్నారని తెలుసుకున్నారు.


'ఏ పాపం ఎరగనివాళ్లు జెయిళ్ళలోను, బయటా కూడా మగ్గుతూనే ఉన్నారు.పాపంలా పెరిగిన పెద్దవారు ఎన్ని పాపాలు చేసినా వారే పెద్దవారిగా ప్రభువులుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు గాక దొరకదు. తనకన్యాయం జరిగితే ఎదుర్కొందికి పేదవాడికి అవకాశం లేదు కాక లేదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది' - అని తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నతరువాత రావిశాస్త్రి రచనలలో చాలా మార్పు వచ్చింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతపు ప్రజల జీవన విధానాలు, మానవ మనస్తత్వాలు ప్రధానంగా చిత్రిస్తూ వచ్చిన తెలుగు కథా ప్రపంచానికి పట్టణ జీవితపు అధోః జగత్తుని విభిన్న కోణాలలో చిత్రిస్తూ సాగిన సారా కథలు ఒక కొత్తలోకాన్ని పరిచయం చేసాయి.మనతోనే ఉంటూ మనం రోజూ చూస్తున్నవారి జీవితాలలో ఎంత విషాదం ఉందో, పేదరికం వారి మధ్య పరస్పర సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించాయి. సంఘంలో నాగరికజీవనం కోసం ఏర్పరచుకున్న నీతి సూత్రాలన్నీ పేదరికం ముందు బలాదూర్ అయిపోతాయి. రక్షించవలసిన పోలీసు వ్యవస్థ అవినీతి రుచి మరిగి భక్షించడం మొదలు పెడితే వారి అక్రమార్జన కోసం మొదట బలయ్యేది పేదలే , అసహాయులే అని రావిశాస్త్రి కథలు నిరూపించాయి.
రావిశాస్త్రి మధ్య తరగతి విషాదాన్ని ఆవిష్కరిస్తూ సాగిన అయ్యో అయ్యో కథలు సారో కథలైతే, అధో జగత్తుకు చెందిన వారి బ్రతుకు పుస్తకాలను తెరిచి చూపించినవి సారా కథలు.
'ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపచేసే రచనలే కళాఖండాలని అటువంటి రసానుభూతినే తాను రసన అంటానని, రావిశాస్త్రి రచనలు రసనను సమృద్ధిగా ఆవిష్కరించగలుగుతున్నాయని' మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు అందుకున్నాయి రావిశాస్త్రి రచనలు.
తనని ఉర్రూతలూగించిన శ్రీశ్రీ మీద గౌరవంతో శ్రీశ్రీ 'కావేవీ కవితకనర్హం' అంటూ చెప్పిన కవితా వస్తువులను కథా వస్తువులుగా స్వీకరించి కుక్కపిల్ల, అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, బల్లచెక్క,అరటితొక్క,తలుపుగొళ్లెం,హారతి పళ్లెం, గుర్రపు కళ్ళెం పేరుతో కథలు వ్రాసారు. చివరి గుర్రపు కళ్ళెం మాత్రం కధ పరిధులను మించిపోయి నవలగా రూపాంతరం చెంది మరిడీ మహాలక్ష్మ కథ, లేదా గోవులొస్తున్నాయి జాగ్రత్త పేరుతో కనిపిస్తుంది.
1970 లో స్వాతంత్ర్యం వచ్చినా దాని ఫలాలను అందుకోలేకపోయిన ప్రజల జీవితాలలోని దుర్భరత నక్సల్బరీ ఆందోళనగా వెల్లడయింది. 'రచయితలారా మీరెటువైపు' అంటూ విద్యార్థి లోకం తమ కరపత్రం ద్వారా రచయితలను, కవులను నిలదీసింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. రావిశాస్త్రి ఉపాద్యక్షుడిగా ఉన్నారు. జీవితాన్ని కేవలం చిత్రించడమే కాకుండా పోలీసులు తుపాకులు పేల్చినప్పుడు నిబ్బరంగా నిలబడే గుండె ధైర్యాన్ని జనానికి తమ రచనల ద్వారా విప్లవ రచయితలు కలిగించాలి. విరసం లక్ష్యం, ధ్యేయం అవే అని, భయం అనే ఈ అడ్డుగోడను భేదిస్తే విప్లవం వస్తుంది. ప్రజలకు జ్ఞానోదయం కలిగించి భయాన్ని నిర్మూలించడమే రచయితల కర్తవ్యం అని త్రికరణ శుద్ధిగా నమ్మి రావిశాస్త్రి ఆ ఆశయ సాధన కోసమే రచనలు చేసారు.
వేతనశర్మ, షోకుపిల్లి, పిపీలికం మొదలైన కథలన్నీ విరసం నేపథ్యంలో వ్రాసినవే.బాకీ కథలు పేరుతో ఈ కథలన్నీ సంపుటిగా వచ్చాయి.
ఏనాడో బ్రిటిష్ ప్రభుత్వంవారి హయాంలో ఏర్పరుచుకున్న కోర్టు విధానాలు , జైళ్ళ పరిపాలన వ్యవహారాలు స్వతంత్రం వచ్చాక కూడా మార్చుకోకుండా కొనసాగించడం జరిగింది. జైలుశిక్ష పడినప్పుడు, విడుదల కావడానికి అనుసరించవలసిన విధి విధానాలు,స్టాంపులు అంటించడం లాంటి చిన్న విషయాలు తెలియకపోయినందుకు నిరక్షరాస్యులైన పేదలు జైళ్ళలో మగ్గి పోవడమే కాక తమ ఆస్తులు సహితం ఎలా కోల్పోవలసి వస్తుందో వివరించిన నవల - సొమ్మలు పోనాయండి.
రెండుసార్లు తన రచనా కళకు దక్కిన ప్రభుత్వగౌరవాలను, కళా ప్రపూర్ణ బిరుదునూ తిరస్కరించారు రావిశాస్త్రి.తాను నమ్మిన సిద్ధాంతాలకు గౌరవం ఇస్తూ.
1975 లో ఎమర్జెన్సీ లో అరెస్టు అయినప్పుడు తీవ్ర అనారోగ్య పరిస్థితుల వలన విరసానికి రాజీనామా చేసి, ప్రభుత్వం విధించిన షరతులకు లొంగి పోయారు.కానీ 1980 లో దశాబ్ది ఉత్సవాలకు హాజరై విరసం కార్యకలాపాలలో క్రియాశీలక పాత్ర వహించారు రావిశాస్త్రి. జైలు జీవితంలో ప్రారంభించిన నవల రత్తాలు రాంబాబు.
రాజు మహిషి,మూడు కథల బంగారం నవలలు వ్రాసిన రావిశాస్త్రి దశాబ్దకాలం పాటు స్తబ్దుగా ఉండి 1993 లో కొందరికి ఉండవలసిన గూడు అయిన ఇల్లు మరికొందరికి పొందవలసిన ఆస్తిగా ఎలా మారుతోందో చెప్పే కథావస్తువును తీసుకొని ఇల్లు నవల వ్రాసేరు.ఏడోచంద్రుడు పేరుతో ప్రారంభించిన నవల పూర్తికాకుండానే తీవ్ర అనారోగ్యం పాలై 72 సంవత్సరాల వయసులో అంతిమ శ్వాస విడిచారు రావిశాస్త్రి.

ఇక కథ లేదు
వ్యథ
దారిలేదు, ఎడారి ఎడారి
అడుగడునా ఇక అశ్రుఘాతాలే
శిరస్సు వ్రయ్యలైన అప శబ్ద శరీరాలే
వీధి మొగలో ధూళి, ధూళి
జీవన గ్రంథం నిండా పొగ, పొగ (అజంతా)
అని రచయితలు రావిశాస్త్రికి అంజలి ఘటించారు.
(ఈ వ్యాసం జులై 30,2008 న పొద్దు వెబ్ పత్రిక లో రావిశాస్త్రి
పుట్టిన రోజుసందర్భంగా ' అస్తమించిన ఏడోచంద్రుడు' పేరుతో ప్రకటించబడింది)
Related Posts with Thumbnails